Home Telangana ఆపిల్ లో హైదరాబాదిల హవా

ఆపిల్ లో హైదరాబాదిల హవా

హైదరాబాదీలకు గుడ్ న్యూస్…ముఖ్యంగా ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ విద్యార్థులకు బంపర్ ఆఫర్. మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ కంప్యూటర్స్.. భారతీయ క్యాంపస్ రిక్రూట్ మెంట్లకు సిద్ధమైంది. అయితే ఈ గొప్ప అవకాశాన్ని మొదటగా దక్కించుకున్నది ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-హైదరాబాదే (ఐఐఐటీ-హెచ్) కావడం గమనార్హం. నూతన నియామకాల కోసం మొదటిసారిగా భారతీయ క్యాంపస్ ల వైపు చూస్తున్న ఆపిల్ చూపు ట్రిపుల్ ఐటీ-హెచ్ పై పడింది.

హైదరాబాద్ తోపాటు బెంగళూరులో గల తమ కేంద్రాలకు అవసరమైన ఉద్యోగుల కోసం ఆపిల్.. ప్రాంగణ నియామకాలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారతీయ కళాశాలల్లో ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ ను అదృష్టం వరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఆటోమేషన్ – డాటా సైన్స్ ల్లో నైపుణ్యం – ప్రతిభాపాటవాలు కలిగిన వారి కోసం వెతుకుతున్నామని ఆపిల్ రిక్రూటర్లు తెలిపారు. డిసెంబర్ లో ట్రిపుల్ ఐటీ-హెచ్ లో నియామకాల ప్రక్రియ మొదలవనుండగా ఇప్పటికే దాదాపు 350 మంది బీటెక్ – ఎంటెక్ – ఎంఎస్ సీ విద్యార్థులు ఇందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆపిల్ తోపాటు గూగుల్ – మైక్రోసాఫ్ట్ – ఫిలిప్స్ కూడా నియామకాలు చేపట్టనుండగా 2డీ-3డీ గ్రాఫిక్ – ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లలో పరిజ్ఞానం ఉన్నవారికి ఉద్యోగాలు దక్కే వీలుందని ట్రిపుల్ ఐటీ-హెచ్ అభిప్రాయపడింది.

1998లో స్థాపించబడిన ట్రిపుల్ ఐటీ-హెచ్ స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయం. లాభాపేక్ష లేని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (ఎన్-పీపీపీ) ప్రాతిపదికన ఇది ఏర్పాటైంది. దేశంలో ఈ తరహా విధానంలో ఏర్పాటైన తొలి ట్రిపుల్ ఐటీ కూడా ఇదే. రిసెర్చ్ యూనివర్సిటీగా మొదలైన ఐఐఐటీ-హైదరాబాద్.. కంప్యూటర్ సైన్స్ – ఎలక్ట్రానిక్స్ – కమ్యూనికేషన్స్ తదితర ఐటీ విభాగాలపై ప్రధాన దృష్టి పెట్టింది. ఇకపోతే చివరిసారిగా ఐఐటీ-హైదరాబాద్ లో 116 సంస్థలు నియామకాలు చేపట్టగా పాల్గొన్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు దక్కాయి. మాస్టర్ డిగ్రీ విద్యార్థులు సగటున రూ.14-17.7 లక్షల మధ్య వార్షిక వేతనాలు అందుకోగా బీటెక్ స్టూడెంట్స్ రూ.13.4-18.8 లక్షల మధ్య పొందారు. టెక్నాలజీ తర్వాత ఉత్పాదక పరిశ్రమల నుంచి మా విద్యార్థులకు అధిక డిమాండ్ కనిపిస్తున్నది అని ఈ సందర్భంగా ఐఐటీ-హెచ్ తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు ఐఐఐటీ-హెచ్ లో ఆపిల్ – గూగుల్ – మైక్రోసాఫ్ట్ తదితర అగ్రశ్రేణి టెక్నాలజీ దిగ్గజాలు రిక్రూట్ మెంట్లకు దిగుతున్నాయి. “క్యాంపస్ నియామకాల కోసం ఆపిల్ మా క్యాంపస్ కు వస్తుండటం గర్వంగా ఉంది. ఎటువంటి నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఆపిల్ కోరుకుంటున్నదో మాకు స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ ఆపిల్ వంటి అగ్రశ్రేణి సంస్థ ప్రతినిధుల ముందు మా విద్యార్థులకు తమ నైపుణ్యం ప్రదర్శించే అవకాశం దక్కడం సంతోషం“ అని ఐఐఐటీ-హైదరాబాద్ ప్లేస్ మెంట్స్ అధిపతి టీవీ దేవీ ప్రసాద్ మీడియాతో వివరించారు. ఈ ఏడాది హార్డ్వేర్ ఇంజినీర్లకు అధిక డిమాండ్ కనిపిస్తోందని చాలా సంస్థలు విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చూస్తున్నాయని చెప్పారు. మైక్రోసాఫ్ట్ – లింక్డిన్ – ఒరాకిల్ – ఫేస్ బుక్ – గూగుల్ సంస్థలు భారత్ లో తమ సిబ్బందిని పెంచుకోవాలనుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here